గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ చేనేత రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా కారణంగా మార్చి 2020 నుండి విధించిన లాక్ డౌన్ చేనేత రంగానికి పెను సవాలుగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా తమను తాము కాపావడుకోవడానికి చేనేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పండుగల సమయాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లు చేనేతలు వారి ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఎగ్జిబిషన్లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునేందుకు, ప్రదర్శించే వస్త్రాలను నెలల ముందు నుండే సిద్దమవుతారు. ప్రస్తుతం అన్నీ మూతపడటంతో మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది. పండుగల్లో వచ్చే ఆర్డర్లపై ఆధారపడ్డ చేనేత కుటుంబాలను, కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా నష్టపరిచింది.
చేనేత రంగం తెలంగాణలో ఉపాధి కల్పించే రెండో పెద్ద రంగం అయినప్పటికీ, సరైన వ్యవస్థ లేని కారణంగా, లాక్ డౌన్ సమయంలో చేనేతలు మరియు పవర్ లూమ్ పై ఆధార పడ్డ వారు, వారి వృత్తిని వదిలి పెట్టాల్సి వచ్చింది.

వినియోగదారులు మరియు ప్రభుత్వం చేనేత ఉత్పత్తులను కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో, చేనేత ఉత్పత్తులు కుప్పలు కుప్పలుగా మిగిలిపోయాయి. డిమాండ్ లేకపోవడమే కాదు, వారు కొన్న ముడి సరుకులు సైతం దుమ్ము పట్టిపోయాయి. ముడి సరుకులు, రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.

నేత కార్మికులు రోజంతా పని చేసినా రూ.100 సంపాదించడం లేదు: చేనేత వస్త్రాలను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. నైపుణ్యమూ అవసరమవుతుంది. కానీ కార్మికులకు తక్కువ ఆదాయం లభిస్తోంది. దీంతో పాటు తక్కువ ఆదాయం, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తోంది. జీవనోపాధి కోసం చేసే పని ఒత్తిడి కారణంగా చేనేతల ఆరోగ్యం చెడిపోవడంతో పాటు, రేపటి ఉపాధి కోసం దిగులు చెందుతూ పడుకుంటారు.
చేనేత కుటుంబాలకు ప్రభుత్వ పథకాల వల్ల పొందే లబ్ది గురించి అవగాహన అనేక మంది ఉండటం లేదు.ప్రభుత్వం కొనుగోలు చేసే తక్కువ ఉత్పత్తులు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుదామని ప్రయత్నం చేసిన వారికీ సరిపడా సాయం అందడం లేదు. పథకాల గురించి కేవలం అవగాహన మాత్రమే వారికి మేలు చేయదు, ఎందుకంటే కనీస రుసుము చెల్లించడానికి కూడా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడమే కాదు, సరైన రీతిలో స్పందించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. చేనేత కుటుంబాల జీవితాలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడ్డాయి. చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక చేయూత ఎంతో అవసరం. మిగిలిన చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు, చేనేత వస్తువులకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇచ్చి ఊరట కల్గించాలి. లాక్ డౌన్ ప్రభావం నుండి కోలుకోవడానికి నష్ట పరిహారం అందించడంతో పాటు, పరిస్థితులు చక్కబడే వరకూ వారికి అండగా నిలిచేందుకు రుణ సౌకర్యం కల్పించాలి.
చేనేత కుటుంబాలకు, చేనేత వస్తువులు రాష్ట్ర సంస్కృతిని కాపాడే మార్గం మాత్రమే కాదు, జీవనోపాధి కూడా. ఇది వారి ఆదాయ వనరు, మనుగడకు కీలకం. ఈ సంపాదన లేకుంటే వారి మనుగడ కష్టమే. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి కారణంగా లాక్ డౌన్ లో అనేక మంది చేనేతలు ప్రాణాలు కోల్పోయారు. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో చేనేత కుటుంబాలు కొట్టుమిట్టాడుతుండగా, సాయం అందించి ఉపశమనం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

దశాబ్దాలుగా, తెలంగాణ నేత కార్మికులు తమ కళాత్మక సృష్టి ద్వారా రాష్ట్ర సంస్కృతిని కాపాడేందుకు తాము చేయగలిగినంత కృషి చేశారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనుగడ సాగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని చేనేతలకు సాయం అందిస్తుందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.